పదవుల్లో ఉన్నవారు పెదవి విప్పరా..? నాయకుడిపైనా, పార్టీపైనా తప్పుడు ప్రచారం చేస్తుంటే మౌనంగా ఉంటారా..? బాధ్యత ఉండక్కర్లేదా అంటూ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్కల్యాణ్. అందరి జాతకాలు తెలుసు.. ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసని అన్నారు. అరవ శ్రీధర్ అంశం దగ్గర నుంచి జోగి రమేష్ ఇంటిపై దాడి వరకు అన్నింటిపైనా నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు పవన్.
పార్టీ నేతలు, ఎమ్మెల్యేల తీరుపై జనసేన జనరల్ బాడీ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పదవులు తీసుకున్న నేతలు.. పార్టీ కోసం ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. పార్టీపైనా, తనపైనా అసత్య ఆరోపణలు జరుగుతుంటే నేతలు మౌనంగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని ప్రశ్నించారు. పార్టీ తరఫున గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు పవన్. పార్టీలో అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరేం చేస్తున్నారనే పూర్తి సమాచారం కూడా తన దగ్గర ఉందన్నారు. ఎవరు ఎంత పని చేస్తున్నారు? ఎవరు బాధ్యతలు నిర్వర్తించట్లేదో తనకు స్పష్టంగా తెలుసన్నారు. ఇకపై నేతల తీరు మారాల్సిందే. లేదంటే ఉపేక్షించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. పార్టీ అభివృద్ధి, ప్రజల నమ్మకం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని పవన్ చెప్పారన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.